Telugu Trends
వెల్దుర్తిలోనే తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ కొనసాగించాలి.. అఖిలపక్షం ఏకగ్రీవ తీర్మానం
పాఠశాల తరలింపును వ్యతిరేకిస్తూ అన్ని పార్టీల నేతల ఐక్య స్వరం
ఎమ్మెల్యే, ఎంపీని కలిసి సమస్య వివరిస్తామని అఖిలపక్ష నాయకుల నిర్ణయం
వెల్దుర్తి, ఆగస్టు 06 (Telugu Trends):
వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ను ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నాలను వెంటనే విరమించి, పాఠశాలను వెల్దుర్తిలోనే కొనసాగించాలని అఖిలపక్ష నాయకులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ మేరకు గురువారం వెల్దుర్తి పీఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువకులు, సామాజికవేత్తలు పాల్గొని పాఠశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్దుర్తి నుంచి తరలించరాదని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తిలోనే ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. స్థల సేకరణ కోసం వచ్చిన రాష్ట్రస్థాయి బృందం గ్రామ పెద్దలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా పరిశీలనలు నిర్వహించడం బాధాకరమన్నారు.
గ్రామస్థులకు ముందుగానే సమాచారం ఇచ్చి ఉంటే పాఠశాల నిర్మాణానికి అనువైన స్థలాన్ని వెంటనే చూపించేవారమని తెలిపారు. ఇప్పటికైనా అవసరమైన స్థలాన్ని చూపించేందుకు గ్రామ ప్రజలు సిద్ధంగా ఉన్నారని, పాఠశాలను వెల్దుర్తిలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమస్యను నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మెదక్ ఎంపీ రఘునందన్ రావు, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి, అధికారులతో చర్చించి పాఠశాల వెల్దుర్తిలోనే కొనసాగేందుకు చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష సమావేశం నిర్ణయించింది.
అలాగే జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రం అందజేసి, పాఠశాల తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కోరనున్నట్లు నాయకులు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తు, మండల ప్రజల విద్యా అవసరాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ మోడల్ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ ఆముద ఆంజనేయులు, మాజీ సింగిల్ విండో చైర్మన్ శేఖర్ గౌడ్, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, సొసైటీ డైరెక్టర్ కృష్ణ గౌడ్, వెల్దుర్తి సర్పంచ్ దండం ఆదర్శ్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ జగ్గ అశోక్ గౌడ్, శ్రీనివాస్ రెడ్డి, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ శ్రావణ్ కుమార్, పాంబండ శేఖర్, మహేందర్ గౌడ్, చందు నవీన్, కిచ్చుగారి సీనుతో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.



కామెంట్ను పోస్ట్ చేయండి