పాత తలుపు రూపంలో మృత్యువు
వెల్దుర్తిలో ఏడేళ్ల బాలిక దుర్మరణం
వెల్దుర్తి మండలం, ఆగస్టు 10 (తెలుగు ట్రెండ్స్):
పాత తలుపు, డోర్ ఫ్రేమ్పై ఎక్కేందుకు ప్రయత్నించిన ఏడేళ్ల బాలికపై తలుపు పడటంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందిన విషాద ఘటన వెల్దుర్తి మండల కేంద్రంలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్దుర్తి గ్రామపంచాయతీ కార్మికుడిగా పనిచేస్తున్న ఆశాల యేసు కుమార్తె అలేఖ్య (7) సోమవారం ఉదయం ఇంటి బయట ఆడుకుంటోంది. ఈ సమయంలో ఇంటి పక్కన ఉంచిన పాత తలుపు, డోర్ ఫ్రేమ్పై ఎక్కేందుకు చిన్నారి ప్రయత్నించింది. ఒక్కసారిగా ఆ తలుపు డోర్ ఫ్రేమ్తో సహా చిన్నారిపై పడిపోవడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.
విషయం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాలికను చికిత్స నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక పరిస్థితి విషమించడంతో మృతిచెందింది.
ఈ ఘటనపై తనకు ఎలాంటి అనుమానాలు లేవని బాలిక తండ్రి యేసు పోలీసులకు తెలిపారు. వెల్దుర్తి ఎస్ఐ కరుణాకర్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అల్లారుముద్దుగా పెంచుకున్న కుమార్తె అనుకోని ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. చిన్నారి మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.


కామెంట్ను పోస్ట్ చేయండి