ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు కార్మికులు మృతి
మరొకరి పరిస్థితి విషమం.. డీసీఎం ఢీకొని ఘటన
మెదక్,
రామాయంపేట : ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, మరో కార్మికుడు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఘటన మనోహరాబాద్ మండలంలో చోటుచేసుకుంది.
స్థానికుల వివరాల ప్రకారం.. మనోహరాబాద్ మండలం దండుపల్లి గ్రామ చౌరస్తాలోని మదీనా చికెన్ సెంటర్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని డీసీఎం ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో స్కూటీపై ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. ప్రమాద తీవ్రతకు ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, మృతిచెందిన ఇద్దరు కార్మికులు, గాయపడిన వ్యక్తి, ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనం రంగాయపల్లి ప్రాంతంలోని ఎంఎస్ అగర్వాల్ ఫౌండరీస్ పరిశ్రమకు చెందినవిగా స్థానికుల ద్వారా సమాచారం అందుతోంది. అయితే దీనిపై అధికారికంగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.


కామెంట్ను పోస్ట్ చేయండి