మంజీరా విద్యాలయంలో ఘనంగా బోనాల వేడుకలు

 


Telugu Trends

మంజీరా విద్యాలయంలో ఘనంగా బోనాల వేడుకలు

పోతరాజుల వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు

తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రత్యేక కార్యక్రమాలు

రామాయంపేట, ఆగస్టు 07 (Telugu Trends):

రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని మంజీరా విద్యాలయంలో తెలంగాణ ఆధ్యాత్మిక, సాంస్కృతిక సంప్రదాయానికి ప్రతీక అయిన బోనాల పండుగను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణాన్ని వేపాకులు, పసుపు, కుంకుమ, పూలతో అందంగా అలంకరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో బోనాలు ఎత్తుకుని అమ్మవారికి సమర్పించి భక్తిశ్రద్ధలను చాటుకున్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ బోనాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీక అని తెలిపారు. బోనం అంటే దేవికి సమర్పించే నైవేద్యమని, పరమాన్నం, పెరుగు, బెల్లం తదితర పదార్థాలతో సిద్ధం చేసిన బోనాలను మహిళలు తలపై మోసుకుని డప్పుల మోతల మధ్య ఆలయానికి వెళ్లడం ఆనవాయితీ అని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా అధికారికంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

వర్షాకాలంలో వ్యాధుల నివారణలో పసుపు, వేపాకుల వినియోగానికి శాస్త్రీయ ప్రాధాన్యం ఉందని, అందుకే అమ్మవారిని వేపాకులతో అలంకరించే సంప్రదాయం ఏర్పడిందని వివరించారు.

కార్యక్రమంలో విద్యార్థులు వల్లభ్ సాయి, శ్రేయాస్, రిత్విక్ రెడ్డి పోతరాజుల వేషధారణలో నృత్యాలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అద్వితి అమ్మవారి వేషధారణలో భక్తులను అలరించడంతో పాటు విద్యార్థులంతా బాగా చదివి పదో తరగతిలో మంజీరా విద్యాలయానికి జిల్లా స్థాయి ఉత్తమ ఫలితాలు తీసుకురావాలని ఆశీర్వచనాలు అందించింది.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జితేందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ సురేష్, అనిల్, శ్రీశైలం, మౌనిక, మీనా, శ్రీనిత, శిరీష, సంధ్య, వసుంధర, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads