MS అగర్వాల్ పరిశ్రమ విస్తరణను నిలిపివేయాలి: సీపీఎం డిమాండ్

 

MS అగర్వాల్ పరిశ్రమ కాలుష్యంపై చర్యలు తీసుకోవాలి: సీపీఎం డిమాండ్


మెదక్ ప్రజావాణిలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం – గ్రామ ప్రజలతో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక

మెదక్, ఆగస్టు 3 (తెలుగు ట్రెండ్స్):
మనోహరాబాద్ మండలం రంగాయిపల్లి గ్రామంలోని MS అగర్వాల్ పరిశ్రమ వల్ల తీవ్ర పర్యావరణ కాలుష్యం ఏర్పడి ప్రజలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ సీపీఎం జిల్లా కార్యదర్శి కె. నర్సమ్మ ఆధ్వర్యంలో మెదక్ ప్రజావాణిలో డీఆర్వో అంబాదాస్ రాజేశ్వర్‌కు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా కె. నర్సమ్మ మాట్లాడుతూ, 2006 నుంచి పరిశ్రమ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని, ఇప్పటికే పలుమార్లు విస్తరణ చేపట్టిందన్నారు. పరిశ్రమ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో భూగర్భ జలాలు కలుషితమవడంతో గ్రామ ప్రజలు చర్మవ్యాధులు, దద్దుర్లు వంటి సమస్యలతో బాధపడుతున్నారని తెలిపారు.

పరిశ్రమ నుంచి వెలువడే దుమ్ము, దూళి, కాలుష్య జలాల వల్ల రైతులు, కూలీలు, మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పందించి పరిశ్రమపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

గ్రామపంచాయతీ అనుమతి లేకుండా పరిశ్రమ విస్తరణ చేపట్టడం సరికాదని పేర్కొంటూ, ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలని ప్రభుత్వాన్ని కోరారు. పరిశ్రమపై చర్యలు తీసుకునే వరకు గ్రామ ప్రజలతో కలిసి దశలవారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎ. మల్లేశం, జిల్లా కమిటీ సభ్యులు సంతోష్, నాయకులు అజయ్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads