విద్యుత్ అధికారుల ప్రజాబాట
మెరుగైన విద్యుత్ సేవలే లక్ష్యం.. తూప్రాన్ డీఈ దశరథ
తూప్రాన్, ఆగస్టు 11:
విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ డీఈ దశరథ తెలిపారు. విద్యుత్ శాఖ సీఎండీ ఆదేశాల మేరకు ప్రతి వారం మంగళవారం, గురువారం ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇందులో భాగంగా మంగళవారం తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలోని మార్కెట్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను డీఈ దశరథ విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ట్రాన్స్ఫార్మర్ల పరిసరాల్లో పేరుకుపోయిన పిచ్చి మొక్కలను తొలగించడంతో పాటు విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించే పనులను చేపట్టారు.
విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ప్రమాదాలకు అవకాశం లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని డీఈ తెలిపారు. ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్లను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ప్రజలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు శాఖ సిబ్బంది నిరంతరం పనిచేస్తున్నారని పేర్కొన్నారు.
విద్యుత్ సమస్యలు, సాంకేతిక ఇబ్బందులు ఎదురైతే వినియోగదారులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాస్, ఏఈ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ – మెదక్


కామెంట్ను పోస్ట్ చేయండి