రామాయంపేటలో ముగ్గురు బాలురు అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం.. సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి
రామాయంపేట, ఆగస్టు 7 (అక్షర కలం):
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని కేసీఆర్ కాలనీకి చెందిన ముగ్గురు బాలురు అదృశ్యమైన ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది. ఈ ఘటనపై రామాయంపేట పోలీసులు కేసు నమోదు చేసి బాలుర ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
కేసీఆర్ కాలనీకి చెందిన మెక్కొండ అశ్విని ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆమె కుమారుడు మెక్కొండ ధనుష్ (13) 8వ తరగతి చదువుతుండగా, అదే కాలనీకి చెందిన ఆరే గీత కుమారుడు మనోజ్ (13) 8వ తరగతి, రూబీనా కుమారుడు షేక్ సమీర్ (13) 9వ తరగతి చదువుతున్నారు. ముగ్గురూ రామాయంపేట ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
ఆగస్టు 6వ తేదీ రాత్రి సుమారు 9 గంటల వరకు కాలనీలో కలిసి ఆడుకున్న బాలురు అనంతరం ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయారని, అప్పటి నుంచి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంధువులు, స్నేహితుల ఇళ్ల వద్ద గాలించినప్పటికీ వారి ఆచూకీ లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.
ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన రామాయంపేట పోలీసులు బాలుర ఆచూకీ కోసం ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తూ, వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
బాలుర ఆచూకీ తెలిసిన వారు రామాయంపేట ఎస్సై 8713667934, సీఐ 8712657933 నంబర్లకు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.




కామెంట్ను పోస్ట్ చేయండి