డ్రగ్స్కు దూరంగా.. భవిష్యత్తుకు బాటగా
కొల్చారం ఎంపీడీవో కార్యాలయంలో మాదకద్రవ్యాలపై అవగాహన కార్యక్రమం
కొల్చారం, ఆగస్టు 13 (తెలుగు ట్రెండ్స్):
మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కొల్చారం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం ఆధ్వర్యంలో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మానవ సంబంధాలు, గంజాయి, డ్రగ్స్, పరిసరాల పరిశుభ్రత, రోడ్డు భద్రత, వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కళా ప్రదర్శనల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు.
ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో కళాబృందం సభ్యులు పాటలు, కళా ప్రదర్శనల ద్వారా పలు సామాజిక అంశాలను వివరించారు. ముఖ్యంగా యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం భవిష్యత్తును నాశనం చేస్తుందని అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా కళాబృందం సభ్యులు మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు దూరంగా ఉండాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు.
అలాగే సైబర్ నేరాలపై కూడా ప్రజలను అప్రమత్తం చేశారు. సైబర్ నేరగాళ్లు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఓటీపీ, పిన్, సీవీవీ, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని అవగాహన కల్పించారు.
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని, ఎలాంటి సమస్య ఎదురైనా భయపడకుండా పోలీసులను సంప్రదించాలని సూచించారు. ట్రాఫిక్ నియమాలను పాటించడం, రోడ్డు భద్రతపై అప్రమత్తంగా ఉండటం, వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం వంటి అంశాలపై కూడా కళా ప్రదర్శనల ద్వారా అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం, కళాబృందం టీం లీడర్ కలంజలి రాజేష్, ముదిగొండ నర్సింలు, విరపత్తిని వెంకటేష్, ఎం. భార్గవి, సడిమెల రాజమణి, నీరటి రవీందర్, ఎరుపుల నరసయ్య, ఎల్లయ్యతో పాటు కొల్చారం మండల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


కామెంట్ను పోస్ట్ చేయండి