యూరియాను అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలి.. వ్యవసాయ అధికారికి పోతారం రైతుల వినతి
మనోహరాబాద్, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్):
ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు యూరియా ఎరువులను విక్రయిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోతారం గ్రామ రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం మనోహరాబాద్ మండల వ్యవసాయ శాఖ అధికారి స్రవంతికి రైతులు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. పోతారం గ్రామానికి సమీపంలోని మనోహరాబాద్లో కొందరు వ్యాపారులు ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే అధిక ధరలకు యూరియా ఎరువులను విక్రయిస్తున్నారని ఆరోపించారు. యూరియా కొరతను ఆసరాగా చేసుకుని అధిక ధరలకు విక్రయించే వారిపై వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
అలాగే పోతారం గ్రామ రైతులు యూరియా కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా శివంపేట, తూప్రాన్ మండలాల్లోని ఎరువుల విక్రయ కేంద్రాల్లో యూరియా కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారిని కోరారు.
పంటల సాగు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా సకాలంలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ఎరువులు అందేలా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
రైతుల సమస్యలను పరిశీలించి, నిబంధనల ప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ అధికారి స్రవంతి హామీ ఇచ్చినట్లు రైతులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పుట్ట వినోద మహేందర్, వార్డు సభ్యులు మన్నె సురేష్, సంకి శ్రీకాంత్, రైతులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ రిపోర్టర్
ఆర్. చంద్రశేఖర్


కామెంట్ను పోస్ట్ చేయండి