సీఎం పర్యటనలో జహీరాబాద్కు నిధులపై ప్రకటన చే సీఎం యాలి
జహీరాబాద్, ఆగస్టు 14: సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాండ్ చేశారు. నియోజకవర్గానికి ఇప్పటికే మంజూరైన నిధులను వెంటనే విడుదల చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు కొత్తగా నిధులు కేటాయించాలని కోరారు.
శుక్రవారం జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాణిక్రావు మాట్లాడారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పలు అభివృద్ధి నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేసిందని ఆయన ఆరోపించారు. పంచాయతీరాజ్ శాఖ ద్వారా రహదారుల అభివృద్ధికి రూ.73 కోట్లు, ఆర్అండ్బీ శాఖ ద్వారా రూ.30 కోట్లు మంజూరైనా పనులు ముందుకు సాగడం లేదన్నారు. దీంతో నియోజకవర్గంలోని అనేక రహదారుల పరిస్థితి అధ్వానంగా మారిందని పేర్కొన్నారు.
జహీరాబాద్ మున్సిపాలిటీకి మంజూరైన రూ.50 కోట్లలో రూ.25 కోట్ల పనులు పూర్తయ్యాయని, మిగిలిన రూ.25 కోట్ల పనులు నిలిచిపోయాయని తెలిపారు. పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే సంగమేశ్వర–బసవేశ్వర ప్రాజెక్టులకు రూ.4 వేల కోట్లు కేటాయించి, దాదాపు 1.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని మాణిక్రావు కోరారు. నియోజకవర్గ సమస్యలను అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించినప్పటికీ ‘నోట్ చేసుకుంటాం’ అనే సమాధానం తప్ప సమస్యలకు పరిష్కారం చూపడం లేదని విమర్శించారు.
ఇటీవల ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి జహీరాబాద్ అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై వినతిపత్రాలు అందజేశామని తెలిపారు. వాటిని పరిశీలిస్తామని కేంద్రం నుంచి స్పందన వచ్చిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతులు ఇచ్చినా స్పందన లేకపోవడం బాధాకరమని ఎమ్మెల్యే మాణిక్రావు ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి