గుడిసెల్లోకి వర్షపు నీరు.. భయంతో బతుకుతున్న మూడు కుటుంబాలు

 

📰



 వర్షాలతో కూలే దశలో పూరిగుడిసెలు.. పట్టించుకోని పంచాయతీ పాలకవర్గం – చిన్న ఘనపూర్ ఎస్సీ కాలనీ వాసుల ఆవేదన

కొల్చారం, ఆగస్టు 04 (తెలుగు ట్రెండ్స్):

మెదక్ జిల్లా కొల్చారం మండలం చిన్న ఘనపూర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో కురుస్తున్న వర్షాల కారణంగా పలువురు నిరుపేదల పూరిగుడిసెలు కూలిపోయే ప్రమాదంలో ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మూడో వార్డులోని మూడు కుటుంబాల పూరిగుడిసెల్లోకి వర్షపు నీరు చేరడంతో ఎప్పుడు కూలిపోతాయోనన్న భయంతో వారు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు.

పలుమార్లు గ్రామపంచాయతీ పాలకవర్గం దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు ఆరోపించారు. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ అధికారులను పదేపదే ఆదేశిస్తున్నప్పటికీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.

వర్షపు నీరు గుడిసెల్లోకి చేరడంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనన్న భయంతో రాత్రింబవళ్లు గడుపుతున్నామని బాధిత కుటుంబాలు వాపోయాయి.

ఇప్పటికైనా జిల్లా, మండల అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకర స్థితిలో ఉన్న పూరిగుడిసెలను పరిశీలించి, బాధిత కుటుంబాలకు తాత్కాలిక నివాస సౌకర్యం కల్పించడంతో పాటు శాశ్వత పరిష్కారం చూపించాలని వారు విజ్ఞప్తి చేశారు.

– తెలుగు ట్రెండ్స్

0/Post a Comment/Comments

ads

ads