వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకే ప్రజాబాట: సీఈ బాలస్వామి
మనోహరాబాద్, ఆగస్టు 20 (తెలుగు ట్రెండ్స్): విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తూప్రాన్ విద్యుత్ శాఖ సీఈ బాలస్వామి తెలిపారు. విద్యుత్ శాఖ సీఎండీ ఆదేశాల మేరకు ప్రతి వారం మంగళవారం, గురువారం ప్రజాబాట కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇందులో భాగంగా గురువారం మనోహరాబాద్ మండల కేంద్రంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిసరాల్లో విద్యుత్ శాఖ సిబ్బందితో కలిసి ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పరిసరాలను పరిశీలించిన సీఈ బాలస్వామి, అక్కడ చేపట్టిన పనుల పురోగతిని తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్ద పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించడం, విద్యుత్ వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించడం వంటి పనులను ప్రజాబాట కార్యక్రమంలో చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంతో పాటు, వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారని చెప్పారు.
విద్యుత్ ప్రమాదాల నివారణకు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ లైన్ల పరిసరాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బందికి సూచించారు. వినియోగదారుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఈ నారాయణ నాయక్, తూప్రాన్ డీఈ దశరథ్, కళ్లకల్ ఏఈ రాజ్కుమార్, విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
తూప్రాన్ రిపోర్టర్: ఆర్. చంద్రశేఖర్ | తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి