అర్చకుల సమస్యల పరిష్కారానికి కృషి: వాసుదేవ శర్మ
మెదక్, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్):
రాష్ట్రంలో ధూప దీప నైవేద్య అర్చకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు వాసుదేవ శర్మ అన్నారు. మంగళవారం సాయంత్రం మెదక్ జిల్లా ఏడుపాయల శ్రీ వనదుర్గామాత ఆలయ ఆవరణలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా వాసుదేవ శర్మ మాట్లాడుతూ అర్చకులు ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గుర్తింపు పొందిన దేవాలయాల్లో అర్చకులకు శీఘ్రదర్శనం కల్పించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని, అందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అర్చకులకు గుర్తింపు కార్డులు అందజేస్తున్నామని తెలిపారు.
అర్చకులకు పే స్కేల్తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో మరిన్ని ఆలయాలకు ధూప దీప నైవేద్య పథకం వర్తించేలా ప్రభుత్వ దృష్టికి సమస్యను తీసుకెళ్లి కృషి చేస్తామని పేర్కొన్నారు.
అర్చకులు ఐక్యంగా ఉండి తమ సమస్యల పరిష్కారం కోసం ముందుండాలని వాసుదేవ శర్మ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సంఘం అధ్యక్షులు సలాక రాజేశ్వర శర్మ, ఉపాధ్యక్షులు గుడి చంద్రశేఖర్ శర్మ, ప్రభాకర్ శర్మ, రాష్ట్ర కోశాధికారి హరికిషన్, ప్రధాన కార్యదర్శి శీలంకోట ప్రవీణ్ శర్మ, కోశాధికారి శ్యామ్ సుందర్ శర్మ, బస్వలింగం తదితరులు పాల్గొన్నారు.



కామెంట్ను పోస్ట్ చేయండి