అయ్యప్ప స్వామి సన్నిధాన నిర్మాణానికి రూ.50 వేల విరాళం
చేగుంట ఉపసర్పంచ్ మొహమ్మద్ రఫీ ఆర్థిక సహాయం
వెల్దుర్తి మండలం, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):
వెల్దుర్తి మండలంలోని బస్వాపూర్ గ్రామంలో శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో నిర్మాణంలో ఉన్న శ్రీ అయ్యప్ప స్వామి సన్నిధానానికి చేగుంట గ్రామ ఉపసర్పంచ్, మండల ఉపసర్పంచుల ఫోరం అధ్యక్షుడు మొహమ్మద్ రఫీ రూ.50 వేల విరాళాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మొహమ్మద్ రఫీ మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కేంద్రాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. భక్తుల సహకారంతో అయ్యప్ప స్వామి సన్నిధానం త్వరితగతిన పూర్తై, భక్తులకు ఆధ్యాత్మిక సేవలు అందించే కేంద్రంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
మొహమ్మద్ రఫీ అందించిన విరాళానికి దేవాలయ కమిటీ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆర్థిక సహాయం సన్నిధాన నిర్మాణ పనులను వేగవంతం చేయడంలో ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవాలయ పూజారి బస్వప్ప, దేవాలయ కమిటీ వైస్ చైర్మన్ జగ్గా అశోక్ గౌడ్, కమిటీ సభ్యులు సుదర్శన్, సత్తయ్య, లచ్చయ్య, రాములు, సంఘం ప్రతినిధులు, గ్రామ పెద్దలు, అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు.


కామెంట్ను పోస్ట్ చేయండి