బోనాల భక్తి వెల్లువలో మెదక్.. అరకటికె సంఘం ఆధ్వర్యంలో నల్లపోచమ్మ తల్లి బోనాలు ఘనంగా

మెదక్, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):

ఆషాఢ బోనాల ఉత్సవాలతో మెదక్ పట్టణం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది. అరకటికె సంఘం ఆధ్వర్యంలో శ్రీమాత నల్లపోచమ్మ తల్లికి అత్యంత వైభవంగా బోనాల మహోత్సవం నిర్వహించారు. ఈ వేడుకల్లో బీఆర్ఎస్ జిల్లా నాయకులు కంఠరెడ్డి తిరుపతిరెడ్డి పాల్గొని బోనం ఎత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా కంఠరెడ్డి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ.. నల్లపోచమ్మ తల్లి కృపాకటాక్షాలతో మెదక్ ప్రజలు సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని కోరుకున్నారు. రాష్ట్రంలో శాంతి, సౌభాగ్యాలు వెల్లివిరియాలని, రైతులకు సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. అరకటికె సంఘం ప్రతి ఏడాది నిర్వహిస్తున్న బోనాల ఉత్సవాలు భక్తి, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సోదరభావం, సామరస్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని అన్నారు.

బోనాల ఊరేగింపులో యువకులతో కలిసి డప్పుల చప్పుళ్లకు అనుగుణంగా కంఠరెడ్డి తిరుపతిరెడ్డి ఉత్సాహంగా నృత్యం చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన యువతతో కలిసి డాన్స్ చేస్తూ వారిలో ఉత్సాహాన్ని నింపారు. మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో బోనాలు సమర్పించగా, భక్తుల జైజైధ్వానాలు, అమ్మవారి నామస్మరణతో మెదక్ పట్టణం భక్తిమయ వాతావరణంలో కళకళలాడింది.

ఈ కార్యక్రమంలో అరకటికె సంఘం సభ్యులు, మున్సిపల్ కౌన్సిలర్లు మామిళ్ల ఆంజనేయులు, జుబేర్ అహ్మద్, దీపక్ కుమార్, మాజీ కౌన్సిలర్ మాయ మల్లేశం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మాణిక్యరెడ్డి, ఏడుపాయల దేవస్థానం మాజీ చైర్మన్ బాలగౌడ్, నాయకులు చంద్రమోహన్ గౌడ్, కిరణ్, జగదీష్, సతీష్ రావు, వేణు, రవి, ప్రభు గౌడ్, నవీన్, శ్రీనివాస్‌తో పాటు యువకులు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

– తెలుగు ట్రెండ్స్

0/Post a Comment/Comments

ads

ads