పొలం వద్ద అస్వస్థతకు గురై వ్యక్తి మృతి
టిఫిన్ చేసిన అనంతరం వాంతులు.. చికిత్స అందేలోపే కన్నుమూత
పాపన్నపేట, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): వ్యవసాయ పనులకు వెళ్లిన ఓ వ్యక్తి పొలం వద్ద ఒక్కసారిగా అస్వస్థతకు గురై మృతి చెందిన విషాద ఘటన పాపన్నపేట మండలంలో చోటుచేసుకుంది. లక్ష్మీనగర్ గ్రామ పరిధిలో బుధవారం ఈ ఘటన జరిగింది.
పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన బోయిని కుమార్ (44) వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రెండు రోజులుగా లక్ష్మీనగర్ గ్రామంలో ఇతరులకు చెందిన వ్యవసాయ పొలంలో పనులకు వెళ్తున్నాడు.
బుధవారం పొలంలో పని చేస్తున్న కుమార్ టిఫిన్ చేసిన అనంతరం చేతులు శుభ్రం చేసుకుంటుండగా ఒక్కసారిగా వాంతులు చేసుకుని అక్కడికక్కడే స్పృహ కోల్పోయాడు. వెంటనే తోటి కూలీలు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని కుమార్ను పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. గుండెపోటు కారణంగానే కుమార్ మృతి చెంది ఉండవచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు.
మృతుడి భార్య యశోద ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
రిపోర్టర్: పి. శ్రీనివాస్, పాపన్నపేట
తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి