మెదక్ మున్సిపల్ బీఆర్ఎస్ కౌన్సిలర్ల కీలక సమావేశం
ఆరు నెలలు గడిచినా అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో లేవని ఆవేదన
మెదక్, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్):
కొత్త పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచినా మెదక్ మున్సిపల్ పరిధిలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి పనులు జరగడం లేదని బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులు పలుమార్లు దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం చూపడం లేదని పేర్కొన్నారు.
9వ వార్డు కౌన్సిలర్ జుబేర్ అహ్మద్ వార్డు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మెదక్ పట్టణంలోని వివిధ వార్డుల సమస్యలపై కౌన్సిలర్లు చర్చించారు. ముఖ్యంగా రోడ్లు గుంతలమయంగా మారడం, కల్వర్టులు దెబ్బతినడం, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాలను ప్రస్తావించారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
వీధికుక్కల బెడదపై ఆందోళన
మెదక్ పట్టణంలో వీధికుక్కల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని కౌన్సిలర్లు ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, మహిళలు వీధికుక్కల కారణంగా భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రజల భద్రతకు సంబంధించిన సమస్యలపై అధికారులు వెంటనే స్పందించాలని, వీధికుక్కల నియంత్రణకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. రోడ్లు, కల్వర్టులు, పారిశుద్ధ్యం, వీధికుక్కల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కొత్త పాలకవర్గం ఏర్పడి ఆరు నెలలు గడిచినా కనీస మౌలిక సదుపాయాల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రజల్లో అసంతృప్తి నెలకొందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు పేర్కొన్నారు. అధికారులు ఇకనైనా స్పందించి పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు.



కామెంట్ను పోస్ట్ చేయండి