ఆడపిల్ల పుట్టిందని.. ఉచితంగా డెలివరీ!
మాట నిలబెట్టుకున్న బాలాజీ నర్సింగ్ హోమ్.. ఆడశిశువుల జననానికి ప్రోత్సాహం
రామాయంపేట, ఆగస్టు 11:
ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించే ఆలోచనా విధానానికి స్వస్తి పలికి.. ఆడశిశువు జననాన్ని ఆనందంగా స్వాగతించాలనే సందేశాన్ని బాలాజీ నర్సింగ్ హోమ్ చాటుతోంది. ఆడపిల్ల పుడితే డెలివరీ ఖర్చులు తీసుకోకుండా ఉచితంగా ప్రసవం నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన ఆస్పత్రి యాజమాన్యం తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకుంది.
రామాయంపేట మండలం సుతార్పల్లి గ్రామానికి చెందిన తిరువాయిముడి ప్రసన్న లక్ష్మీ ప్రసవం కోసం బాలాజీ నర్సింగ్ హోమ్ను ఆశ్రయించారు. ఈ నెల 5న డాక్టర్ హేమరాజ్ సింగ్ నేతృత్వంలో ప్రసవం నిర్వహించగా ఆమెకు ఆడశిశువు జన్మించింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం ముందుగా ప్రకటించిన నిర్ణయం మేరకు డెలివరీకి సంబంధించిన ఖర్చులు తీసుకోకుండా ఉచితంగా ప్రసవం నిర్వహించింది.
ఈ సందర్భంగా ఆస్పత్రి యాజమాన్యం ఎం. రామరాజు మాట్లాడుతూ.. సమాజంలో ఆడపిల్లల పట్ల ఉన్న వివక్షను తొలగించి, వారి జననాన్ని ఆనందంగా స్వాగతించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఆడపిల్ల పుట్టిన ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే లక్ష్యంతో ఉచిత డెలివరీ సౌకర్యాన్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు.
ఆడపిల్లలు కుటుంబానికి, సమాజానికి భారమేమీ కాదని.. అబ్బాయిలతో సమానంగా వారికి అవకాశాలు, గౌరవం కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. ఆడశిశువుల జననాన్ని కుటుంబ సభ్యులు ఆనందంగా స్వాగతించేలా సమాజంలో మరింత చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఆడపిల్లల జననాన్ని ప్రోత్సహిస్తూ బాలాజీ నర్సింగ్ హోమ్ యాజమాన్యం చేపట్టిన ఈ కార్యక్రమంపై పలువురు అభినందనలు తెలిపారు. వ్యాపార దృక్పథానికి అతీతంగా సామాజిక బాధ్యతతో ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ అజాసాగర్, సిబ్బంది ముత్తనోళ్ల రేఖ, భూమ రాజమణితో పాటు పలువురు పాల్గొన్నారు.
— తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి