ట్యాంకర్ బీభత్సం.. ఐదుగురు కూలీలు మృతి
ఆటోను ఢీకొట్టిన ట్యాంకర్.. ఏడుగురికి తీవ్ర గాయాలు
ముగ్గురి పరిస్థితి విషమం
మొగడంపల్లి జహిరాబాద్ , ఆగస్టు 11 (తెలుగు ట్రెండ్స్):
సంగారెడ్డి జిల్లా మొగడంపల్లి మండలం సత్వార్ గ్రామ సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటోను వేగంగా వచ్చిన ట్యాంకర్ ఢీకొనడంతో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ట్యాంకర్ ఢీకొన్న ధాటికి ఆటో నుజ్జునుజ్జయింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ జిల్లా రాజగిరి గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. ప్రతిరోజూ మాదిరిగానే జహీరాబాద్ ప్రాంతంలో వ్యవసాయ పనులకు వచ్చి, పనులు ముగించుకుని ఆటోలో స్వగ్రామానికి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఘటనతో సత్వార్ పరిసరాల్లో విషాదం నెలకొంది.


కామెంట్ను పోస్ట్ చేయండి