ఉద్యోగుల హెల్త్ కార్డులు పనిచేయకపోవడం బాధాకరం
ఆసుపత్రుల్లో ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కాకపోవడంపై టీఎన్జీవో ఆవేదన
మెదక్, ఆగస్టు 11:
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య కార్డులు ఆసుపత్రుల్లో పనిచేయకపోవడం బాధాకరమని టీఎన్జీవో మెదక్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ అన్నారు. మంగళవారం మెదక్లోని టీఎన్జీవో భవన్లో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఉద్యోగుల వేతనాల నుంచి ఆరోగ్య బీమా కోసం ప్రతి నెలా 1.5 శాతం చొప్పున మూడు నెలలుగా కోత విధిస్తున్నప్పటికీ, అవసరమైన సమయంలో ఆసుపత్రుల్లో ప్రభుత్వం జారీ చేసిన ఆరోగ్య కార్డులు చెల్లుబాటు కాకపోవడం విచారకరమన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రులకు వెళ్లే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రభుత్వం ఇప్పటికైనా ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి ఉద్యోగులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రైవేట్ బీమా సంస్థల ద్వారా వచ్చే రోగులకు అందుతున్న విధంగానే ఉద్యోగులు, వారి ఆధారిత కుటుంబ సభ్యులకు కూడా చికిత్స అందేలా చూడాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
అనంతరం జిల్లా కార్యదర్శి రాజ్కుమార్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయడంతో పాటు పీఆర్సీ నివేదిక తెప్పించి ఫిట్మెంట్ ప్రకటించాలని కోరారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, మెదక్ జిల్లాను రాజన్న జోన్ నుంచి చార్మినార్ జోన్లో కలపాలని కోరుతూ పలు తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించారు.
సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి గాండ్ల అనురాధ, జిల్లా సహాధ్యక్షుడు ఇక్బాల్ పాషా, ఉపాధ్యక్షులు అర్షద్, ఫజాలుద్దీన్, క్రీడల కార్యదర్శి గోపాల్, తూప్రాన్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు సంతోష్, నరేందర్ గౌడ్, ఏడుపాయల వన దుర్గ యూనిట్ కార్యదర్శి ప్రశాంత్, పశుసంవర్ధక శాఖ ఫోరం కార్యదర్శి లింగమూర్తి తదితర ఉద్యోగులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ – మెదక్


కామెంట్ను పోస్ట్ చేయండి