విద్యార్థులు నాయకత్వ లక్షణాలు కలిగి ఉండాలి
ఎస్సై కృష్ణయ్య
నర్సాపూర్: విద్యార్థులు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని నర్సాపూర్ ఎస్సై కృష్ణయ్య అన్నారు. నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని హనుమంతపూర్లో ఉన్న గిరిదీపం పాఠశాలలో శుక్రవారం ఇన్వెస్టిచర్ సెర్మనీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, బాధ్యత, క్రమశిక్షణ, సేవాభావాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎస్సై కృష్ణయ్య మాట్లాడుతూ.. నాయకత్వం అంటే కేవలం పదవి కాదని, బాధ్యతను స్వీకరించి ఇతరులకు ఆదర్శంగా నిలవడమే నిజమైన నాయకత్వమని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకోవడంతో పాటు సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండాలని సూచించారు.
నూతనంగా నాయకత్వ బాధ్యతలు స్వీకరించిన విద్యార్థులు మాట్లాడుతూ.. తమకు అప్పగించిన బాధ్యతలను గౌరవంగా నిర్వహిస్తామని ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల క్రమశిక్షణను పాటిస్తూ, తోటి విద్యార్థులకు సహాయం చేస్తామని, ఉపాధ్యాయుల సూచనలను పాటించి పాఠశాలకు మంచి పేరు తీసుకువచ్చేలా కృషి చేస్తామని తెలిపారు.
అనంతరం నూతన విద్యార్థి నాయకులకు బ్యాడ్జీలు అందజేసి బాధ్యతలను అప్పగించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ప్రవీణ్రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ కవితారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ఎండి. మోసిన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి