నర్సాపూర్ లో జాతీయ జెండా ఆవిష్కరణ పై రచ్చ.. కౌన్సిలర్ వర్సెస్ మాజీ మున్సిపల్ చైర్మన్!
- నర్సాపూర్ 1వ వార్డు హనుమంతపూర్ లో ఉద్రిక్తత
- కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం
- రెండు వర్గాలను పక్కనపెట్టి జెండా ఎగరేసిన వార్డు పెద్దలు
నర్సాపూర్ (తెలుగు ట్రేండ్స్): నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. జాతీయ జెండా ఎగురవేసే విషయంలో నర్సాపూర్ 1వ వార్డు హనుమంతపూర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హనుమంతపూర్ లో ఏర్పాటు చేసిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని తామే ఆవిష్కరిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మినీకే నర్సమ్మ, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరినొకరు హెచ్చరించుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తలు పోటీపడి దూషణలకు దిగారు. దీంతో అక్కడ కాసేపు ఘర్షణ వాతావరణం ఏర్పడింది.
పరిస్థితి చేయిదాటిపోతుండటంతో స్థానిక వార్డు పెద్దలు తక్షణమే జోక్యం చేసుకున్నారు. ఇరువర్గాల నాయకులను, కార్యకర్తలను పక్కకు పంపి, వార్డు పెద్దలే స్వయంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దీంతో వివాదం సద్దుమణిగింది. మువ్వన్నెల జెండా ఆవిష్కరణ వద్ద చోటుచేసుకున్న ఈ రాజకీయ వివాదం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


కామెంట్ను పోస్ట్ చేయండి