వెల్దుర్తిలోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్ కొనసాగించాలి
కుక్కునూర్కు తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని గ్రామస్థుల వినతి
తెలుగు ట్రెండ్స్ | వెల్దుర్తి | ఆగస్టు 1:
నర్సాపూర్ నియోజకవర్గంలోని వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను కుక్కునూర్ గ్రామానికి తరలించవద్దని కోరుతూ వెల్దుర్తి గ్రామస్థులు శనివారం మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్, జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈవో) రాజుకు వినతిపత్రం సమర్పించారు.
గ్రామ సర్పంచ్ ఆదర్శ్ ఆధ్వర్యంలో సమర్పించిన వినతిపత్రంలో, తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే కొనసాగించాలని కోరారు. పాఠశాలను కుక్కునూర్కు తరలిస్తే మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు రవాణా, విద్యా సౌకర్యాల పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపారు. దీంతో విద్యార్థుల చదువుపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించి, తెలంగాణ పబ్లిక్ స్కూల్ను వెల్దుర్తి మండల కేంద్రంలోనే కొనసాగించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్, డీఈవోలను గ్రామస్థులు కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఆదర్శ్, ఉపసర్పంచ్ శ్రవణ్ కుమార్, శేఖర్ గౌడ్, పాంబండ శేఖర్, చందు, మహేందర్ గౌడ్, రమేష్, నవీన్, గ్రామ యువకులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


కామెంట్ను పోస్ట్ చేయండి