భక్తిశ్రద్ధలతో మార్మోగిన రామాయంపేట.. వైభవంగా శ్రీ మహంకాళి మాత బోనాలు
అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు
రామాయంపేట, ఆగస్టు 9:
మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో ఆషాఢ మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని శ్రీ మహంకాళి మాత బోనాల ఉత్సవాలు ఆదివారం భక్తిశ్రద్ధలతో, వైభవంగా నిర్వహించారు. పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలను పురవీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. దీంతో రామాయంపేట పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది.
సాయంత్రం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు శ్రీ మహంకాళి మాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తిశ్రద్ధలతో పట్టువస్త్రాలు సమర్పించారు. ఎమ్మెల్యేకు ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు వేద మంత్రోచ్ఛారణల మధ్య ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు మాట్లాడుతూ శ్రీ మహంకాళి మాత దివ్య ఆశీస్సులతో పట్టణ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ధనధాన్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
మున్సిపల్ కౌన్సిలర్ నాగరాజు మాట్లాడుతూ ఆషాఢ మాసం బోనాల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించామని, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ చైర్పర్సన్ పోచమ్మల నవనీత గణేష్, కౌన్సిలర్లు దేవుని రంజిత్, గుగులోత్ రవి, దాకి శ్యామల స్వామి, చింతల రాధా భవాని యాదగిరి, చింతల స్వప్న స్వామి, మద్దెల మాధవి రమేష్, సుంకోజి దామోదర్, మంజుల సుందర్ సింగ్, అనిత శ్రీశైలం, సామల రవి, దారం సంతోష్, బీర రామచంద్రం, మంగలి సత్యం, దోమకొండ యాదగిరి, భూమా కిషన్, ఇసుక ప్రకాష్, ఆలయ ఈవో రవికుమార్, చైర్మన్ సరాఫ్ పాండురంగచారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.


కామెంట్ను పోస్ట్ చేయండి