ఎమ్మెల్యే చింత ప్రభాకర్పై విమర్శలు చేస్తే సహించేది లేదు: బీఆర్ఎస్ నేతలు
సంగారెడ్డి, ఆగస్టు 12 (తెలుగు ట్రెండ్స్):
సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్పై కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు అతిఉత్సాహంతో, స్థాయికి మించి మాట్లాడుతున్నారని విమర్శించారు. బుధవారం సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ నేతలకు ఘాటైన కౌంటర్ ఇచ్చారు.
అభివృద్ధి అంటే గుర్తొచ్చే పేరు చింత ప్రభాకర్ అని పేర్కొన్న బీఆర్ఎస్ నేతలు.. సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు సహకారంతో ఎమ్మెల్యే చింత ప్రభాకర్ విశేష కృషి చేశారని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో సుమారు రూ.822 కోట్లతో, సదాశివపేట పట్టణంలో సుమారు రూ.264 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.
అభివృద్ధి పనులపై ఎవరికైనా సందేహాలు ఉంటే సంగారెడ్డి, సదాశివపేటలో ఆధారాలతో బహిరంగ చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని, కాంగ్రెస్ నేతలు కూడా చర్చకు రావాలని సవాల్ విసిరారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా అభివృద్ధి అంశాలపై మాట్లాడితే తాము సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
కరోనా సమయంలో తన ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా చింత ప్రభాకర్ ప్రజల మధ్య ఉంటూ సేవలు అందించారని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. ఎమ్మెల్యేగా ఓడిపోయిన సమయంలోనూ ప్రజలకు దూరంగా ఉండకుండా కలెక్టరేట్ ఎదుట క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉన్నారని తెలిపారు.
సంగారెడ్డి అభివృద్ధి ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ నేతలు వాస్తవాలను ప్రజలకు వివరించాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఐఐటీ హైదరాబాద్ను జగ్గారెడ్డి తీసుకొచ్చారని చెబుతున్నప్పుడు దానికి ‘ఐఐటీ సంగారెడ్డి’ అనే పేరు ఎందుకు పెట్టలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజీవ్ పార్క్ అభివృద్ధి విషయంలో కూడా గతంలో హామీలు ఇచ్చి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.
“మా నాయకుడిపై వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకుని సంగారెడ్డి అభివృద్ధిపై దృష్టి పెట్టండి. మీ గత చరిత్ర, మీ పాలనపై కూడా మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. అవసరమైతే ఆధారాలతో మాట్లాడతాం. విమర్శలు చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి” అని బీఆర్ఎస్ నేతలు హెచ్చరించారు.
తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎవరు ఏ సమయంలో ఏ విధంగా మాట్లాడారో ప్రజలకు తెలుసని, ముందుగా ‘జై తెలంగాణ’ నినాదం విషయంలో తమ వైఖరిని స్పష్టం చేయాలని కాంగ్రెస్ నేతలకు సూచించారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పదవులు వస్తుంటాయి.. పోతుంటాయని, ప్రజల కోసం చేసిన అభివృద్ధి పనులు, ప్రజలతో ఉన్న అనుబంధమే శాశ్వతమని బీఆర్ఎస్ నేతలు అన్నారు. వ్యక్తిగత విమర్శలు కాకుండా అభివృద్ధిపై చర్చకు రావాలని, సంగారెడ్డి అభివృద్ధిపై ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు.
మీడియా సమావేశంలో ఎస్కే రషీద్, అక్బర్ హుస్సేన్, కసిని శ్రీకాంత్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, లతీఫ్, జాఫర్, అజ్జు, మజీద్, విష్ణు, నజీం, ఖలీమ్ పటేల్, సమద్, ఖమీల్, కుద్దుష్, వహాబ్, వాజిద్, చింటూ, శ్రవణ్ రెడ్డి, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్ను పోస్ట్ చేయండి