ఏడుపాయల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీ.. పోలీసుల విచారణతో వెలుగులోకి!
మెదక్, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్):
ఏడుపాయల శ్రీ వనదుర్గామాత ఆలయ పరిధిలోని టేకులబొడ్డె వద్ద జాతర సమయంలో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన 25 కేవీఏ త్రీఫేస్ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విద్యుత్ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైన విషయం తెలియకపోవడం చర్చనీయాంశంగా మారింది.
జాతర సమయంలో భక్తులు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని విద్యుత్ సరఫరా కోసం టేకులబొడ్డె పరిధిలో 25 కేవీఏ త్రీఫేస్ ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. అయితే కొంతకాలంగా అది కనిపించకుండా పోయినప్పటికీ విద్యుత్ శాఖ అధికారులు, సంబంధిత క్షేత్రస్థాయి సిబ్బంది గుర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది.
మరోవైపు అనుమానాస్పదంగా సంచరిస్తున్న కొందరిని కొల్చారం పోలీసులు విచారించగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి సంబంధించిన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది. పోలీసుల విచారణ సందర్భంగా ఈ విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో చోరీ ఘటన బయటపడినట్లు సమాచారం.
పోలీసుల ద్వారా సమాచారం అందే వరకు తమ పరిధిలోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చోరీకి గురైన విషయం సంబంధిత అధికారులకు తెలియకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రధాన పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రమైన ఏడుపాయల పరిధిలో విద్యుత్ పరికరాల భద్రతపై పర్యవేక్షణ ఏ మేరకు ఉందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
క్షేత్రస్థాయిలో ఏర్పాటు చేసిన విద్యుత్ పరికరాలను ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, చోరీ జరిగిన విషయం పోలీసుల విచారణ ద్వారా బయటపడటం విద్యుత్ శాఖ పర్యవేక్షణ తీరుపై విమర్శలకు దారితీస్తోంది.
ఈ ఘటనపై పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ చోరీకి పాల్పడిన వ్యక్తులు ఎవరు? చోరీ ఎప్పుడు జరిగింది? అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టినట్లు తెలిసింది.
తెలుగు ట్రెండ్స్ రిపోర్టర్,
పి. శ్రీనివాస్, పాపన్నపేట


కామెంట్ను పోస్ట్ చేయండి