రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలి
మనోహరాబాద్ వ్యవసాయ అధికారిణి స్రవంతి
తూప్రాన్/మనోహరాబాద్, ఆగస్టు 15 (తెలుగు ట్రెండ్స్): వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించాలని మనోహరాబాద్ వ్యవసాయ అధికారిణి స్రవంతి సూచించారు. మంగళవారం రామాయపల్లి గ్రామంలో వాతావరణ పరిస్థితులపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ అధికారిణి స్రవంతి మాట్లాడుతూ.. ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైతులు పంటల సాగులో మార్పులు చేసుకోవాలని సూచించారు. ముఖ్యంగా వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేసే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని తెలిపారు.
పప్పు దినుసులు, మొక్కజొన్న, చిరుధాన్యాలు, స్వీట్ కార్న్, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి పంటలను సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు. తక్కువ నీటితో పండే ఆకుకూరలు, కూరగాయల పంటలను కూడా సాగు చేయడం ద్వారా రైతులు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
రైతులకు అవసరమైన కందుల విత్తనాలు స్థానిక వ్యవసాయ కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రైతులు వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటలను ఎంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జక్కుల సత్యనారాయణతో పాటు పలువురు రైతులు పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్ | తూప్రాన్/మనోహరాబాద్, శ్రీనివాస్


కామెంట్ను పోస్ట్ చేయండి