ప్రజారోగ్యానికి పెద్దపీట ఎక్కడ? ప్రభుత్వ దవాఖానలోనే వర్షపు నీరు
వైద్యం కోసం వస్తే.. వర్షపు నీటితో అవస్థలు
దవాఖానలోనే అపరిశుభ్ర వాతావరణం.. అధికారుల నిర్లక్ష్యంపై రోగుల ఆగ్రహం
తెలుగు ట్రేండ్స్, వెల్దుర్తి మండలం, ఆగస్టు 08:
గత మూడు నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో పెద్దఎత్తున వర్షపు నీరు నిలిచిపోయింది. దీంతో వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అనారోగ్యంతో చికిత్స కోసం ప్రభుత్వ దవాఖానకు వస్తున్న రోగులకు ఆసుపత్రి ప్రాంగణంలోనే వర్షపు నీరు నిలిచిపోవడంతో నడిచేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజుల తరబడి నీరు నిల్వ ఉండటంతో దోమల బెడద పెరిగే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రోగాలు నయం చేసుకునేందుకు వచ్చే ఆసుపత్రిలోనే అపరిశుభ్ర వాతావరణం ఎందుకు? అని రోగులు ప్రశ్నిస్తున్నారు. ఇళ్ల పరిసరాల్లో మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించే అధికార యంత్రాంగం.. ప్రభుత్వ దవాఖాన పరిసరాల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
వర్షపు నీటిని వెంటనే బయటకు మళ్లించడంతో పాటు ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత చర్యలు చేపట్టాలని రోగులు, వారి సహాయకులు కోరుతున్నారు. సమస్యపై సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ దవాఖానలోనే ఇలా వర్షపు నీరు నిలిచిపోవడంపై అధికారులు స్పందించి సమస్యను పరిష్కరిస్తారా? లేక వర్షాలు తగ్గే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అనేది వేచి చూడాల్సి ఉంది.




కామెంట్ను పోస్ట్ చేయండి