పింఛన్ కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త!
నేటి నుంచే కొత్త పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ
వితంతు, దివ్యాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులకు అవకాశం
ఏపీఎం సుభాష్ గౌడ్ వెల్లడి
వెల్దుర్తి మండలం, ఆగస్టు 9 (తెలుగు ట్రెండ్స్):
పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులైన వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. నూతన పింఛన్ల మంజూరుకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పింఛన్లు ప్రారంభం కానున్న నేపథ్యంలో అర్హులైన వెల్దుర్తి మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎం సుభాష్ గౌడ్ సూచించారు.
వితంతు పింఛన్, దివ్యాంగుల పింఛన్, వృద్ధాప్య పింఛన్, ఒంటరి మహిళా పింఛన్, గీత కార్మికుల పింఛన్ తదితర పింఛన్లకు అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.
దరఖాస్తుకు అవసరమైన పత్రాలు
దరఖాస్తుదారులు నూతన పింఛన్ అప్లికేషన్ ఫారంతో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, భూమి పాస్బుక్ జిరాక్స్, ఫోన్ నంబర్, పాస్పోర్ట్ సైజు ఫొటో తదితర పత్రాలను సమర్పించాలి.
అదేవిధంగా..
- వితంతువులు: భర్త మరణ ధ్రువీకరణ పత్రం
- దివ్యాంగులు: సదరం సర్టిఫికెట్
- ఒంటరి మహిళలు: విడాకుల ధ్రువీకరణ పత్రం
- గీత కార్మికులు: సంబంధిత ధ్రువీకరణ పత్రాలు
తప్పనిసరిగా జత చేయాలని ఏపీఎం సుభాష్ గౌడ్ సూచించారు.
గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తుల సమర్పణ
అన్ని అవసరమైన పత్రాలను సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందజేయాలని ఆయన తెలిపారు. ఇప్పటికే గతంలో పింఛన్ కోసం గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ పూర్తి దరఖాస్తును సమర్పించాల్సిన అవసరం లేదని, అయితే నూతన అప్లికేషన్ ఫారాన్ని తప్పనిసరిగా జత చేయాలని స్పష్టం చేశారు.
వితంతు, ఒంటరి మహిళా పింఛన్లకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన అర్హతలు కలిగిన వారికి మాత్రమే పింఛన్ మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
నూతన పింఛన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైన నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకుని సంబంధిత గ్రామ పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని ఏపీఎం సుభాష్ గౌడ్ కోరారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.


కామెంట్ను పోస్ట్ చేయండి