“కంటి చూపుకు భరోసా.. రాజన్న ఫౌండేషన్ ఉచిత సేవలు”

 


ప్రజల చూపుల్లో వెలుగులు నింపడమే లక్ష్యం

కంటి చూపుకు భరోసా.. ప్రజాసేవకు రాజన్న ఫౌండేషన్ అండ

కంటి పరీక్షల నుంచి ఆపరేషన్ల వరకు ఉచిత సేవలు.. అద్దాల పంపిణీ చేసిన నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజారెడ్డి

తెలుగు ట్రేండ్స్, వెల్దుర్తి మండలం, ఆగస్టు 08:
ప్రజల ఆరోగ్య అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని నర్సాపూర్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆవుల రాజారెడ్డి తెలిపారు. వెల్దుర్తి మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో శనివారం రాజన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి అద్దాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆవుల రాజారెడ్డి హాజరై లబ్ధిదారులకు కంటి అద్దాలను అందజేశారు.

ఈ సందర్భంగా ఆవుల రాజారెడ్డి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కంటి సమస్యలకు సరైన వైద్యం పొందలేని పేద, మధ్యతరగతి ప్రజలకు అండగా నిలవాలనే ఉద్దేశంతో ఉచిత కంటి వైద్య సేవలను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా వెల్దుర్తి మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

కంటి పరీక్షల్లో సమస్యలు గుర్తించిన వారికి వైద్యుల సూచన మేరకు అవసరమైన కంటి ఆపరేషన్లు కూడా చేయించినట్లు తెలిపారు. తాజాగా కంటి అద్దాలు అవసరమైన లబ్ధిదారులను గుర్తించి వారికి ఉచితంగా అద్దాలను అందజేస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడమే రాజన్న ఫౌండేషన్ ప్రధాన ఉద్దేశమని ఆవుల రాజారెడ్డి అన్నారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా నర్సాపూర్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

ప్రజల అవసరాలను గుర్తించి వారికి సాధ్యమైనంత మేరకు సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటామని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా కంటి వైద్య సేవలను మరింత విస్తరించి, అవసరమైన వారికి కంటి పరీక్షలు, చికిత్స, ఆపరేషన్లు, కంటి అద్దాల పంపిణీ వంటి సేవలను అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

ఉచితంగా కంటి అద్దాలు అందడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలను పలువురు అభినందించారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రజలు, నాయకులు, ప్రజాప్రతినిధులు, ఫౌండేషన్ సభ్యులకు ఆవుల రాజారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు నరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహేష్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ అముద ఆంజనేయులు, తాజా మాజీ వైస్ ఎంపీపీ సుధాకర్ గౌడ్, తలారి మల్లేశం, నరసింహారెడ్డి, మాజీ సింగిల్ విండో చైర్మన్ శేఖర్ గౌడ్, పోతిరెడ్డి, కిష్టా గౌడ్, దుర్గా గౌడ్‌తో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, మాజీ సర్పంచులు, ప్రజలు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads