భవితా కేంద్రం విద్యార్థులకు ఆటలతో అభ్యాసం
తండ్రి జ్ఞాపకార్థం ఎంఈఓ ఉమారాణి సేవా కార్యక్రమం
కొల్చారం, ఆగస్టు 14: మండలంలోని అప్పాజీపల్లి గ్రామంలో ఉన్న భవితా కేంద్రంలో విద్యను అభ్యసిస్తున్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు కార్యాచరణ ఆధారిత అభ్యాసానికి ఉపయోగపడే విద్యా ఆట వస్తువులను శుక్రవారం పంపిణీ చేశారు. మండల విద్యాధికారి ఉమారాణి తన తండ్రి స్వర్గీయ కే. సాయిలు (రిటైర్డ్ ఎంఆర్ఓ) జ్ఞాపకార్థం ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఈఓ ఉమారాణి మాట్లాడుతూ.. ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరచడంలో కార్యాచరణ ఆధారిత అభ్యాసం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. ఆట వస్తువుల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి, చురుకుదనం, ఆలోచనా సామర్థ్యం, సృజనాత్మకత పెంపొందుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా అందించిన మెటీరియల్ను సద్వినియోగం చేసుకోవాలని భవితా కేంద్రం సిబ్బందికి సూచించారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల అభ్యసనానికి తోడ్పడేలా సేవా కార్యక్రమం నిర్వహించిన ఎంఈఓ ఉమారాణికి భవితా కేంద్రం సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో భవితా కేంద్రం సిబ్బంది ఆకాష్, నిఖిత, పాఠశాల సిబ్బంది నారాయణ, మండల ఎంఐఎస్ కోఆర్డినేటర్ సంపత్ కుమార్ పాల్గొన్నారు.
తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి