వెల్దుర్తిలో పబ్లిక్ స్కూల్ కోసం బంద్.. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం వద్దని ప్రజల హెచ్చరిక
వెల్దుర్తి, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):
వెల్దుర్తి మండల కేంద్రానికి మంజూరైన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను మండల పరిధిలోని కుక్కునూరు గ్రామానికి తరలించే ప్రయత్నాలను వెంటనే విరమించాలని డిమాండ్ చేస్తూ సోమవారం అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, యువకులు కలిసి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద బంద్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. వెల్దుర్తి మండల కేంద్రానికి ప్రభుత్వం మంజూరు చేసిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ను కుక్కునూరు గ్రామానికి తరలించడం విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధమని అన్నారు. ఈ నిర్ణయం అమలైతే వెల్దుర్తి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
వెల్దుర్తికి మంజూరైన పాఠశాలను అదే ప్రాంతంలో ఏర్పాటు చేసి, తరలింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని, విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరారు.
పాఠశాల తరలింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఆందోళనలను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడతారని తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమంలో పాంబండ శేఖర్, శేఖర్ గౌడ్, మహేందర్ గౌడ్, చందు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు, స్థానికులు పాల్గొని పాఠశాల తరలింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.


కామెంట్ను పోస్ట్ చేయండి