సమయపాలన పాటించని వ్యవసాయ శాఖ అధికారులు.. కార్యాలయం ముందు రైతుల నిరసన
వెల్దుర్తి, ఆగస్టు 3 (తెలుగు ట్రెండ్స్): వెల్దుర్తి మండల వ్యవసాయ శాఖ అధికారులు సమయపాలన పాటించకపోవడంతో రైతులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం కార్యాలయ సమయం దాటినా మండల వ్యవసాయ శాఖ కార్యాలయం తెరుచుకోకపోవడంతో, వివిధ పనుల నిమిత్తం వచ్చిన రైతులు కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు.
ప్రస్తుతం వ్యవసాయ సాగు సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో యూరియా బుకింగ్, ఇతర వ్యవసాయ సంబంధిత పనుల కోసం రైతులు ఉదయం 10 గంటలకే కార్యాలయానికి చేరుకున్నారు. అయితే ఉదయం 11 గంటలు దాటినా అధికారులు కార్యాలయానికి రాకపోవడంతో పాటు కార్యాలయానికి తాళం వేసి ఉండటాన్ని చూసి రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా రైతులు ప్రభు, సత్యనారాయణ, చంద్రయ్య మాట్లాడుతూ, సాగు సీజన్లో రైతులకు అత్యవసర సేవలు అందించాల్సిన అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమన్నారు. రైతులు గంటల తరబడి కార్యాలయం వద్ద వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా వ్యవసాయ శాఖ అధికారులు సమయపాలన పాటిస్తూ కార్యాలయంలో అందుబాటులో ఉండాలని, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, వ్యవసాయ సాగుకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని రైతులు కోరారు.



కామెంట్ను పోస్ట్ చేయండి