బుర్ఖాలు ధరించి వచ్చి.. బంగారం చోరీ
జహీరాబాద్, ఆగస్టు 17 (తెలుగు ట్రెండ్స్, జహీరాబాద్ : జహీరాబాద్ పట్టణంలోని భవానీ మందిర్ రోడ్డులో ఉన్న న్యూ జై భవానీ జ్యువెలరీ షాపులో బంగారు ఆభరణాల చోరీ కలకలం రేపింది. ఆదివారం సాయంత్రం బుర్ఖాలు ధరించిన నలుగురు గుర్తుతెలియని మహిళలు నగల దుకాణంలోకి వచ్చి చోరీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.
ఎస్ఐ లవ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. సాయంత్రం సమయంలో నలుగురు మహిళలు బుర్ఖాలు ధరించి జ్యువెలరీ షాపులోకి ప్రవేశించారు. అనంతరం యజమానిని వివిధ రకాల బంగారు ఆభరణాలు చూపించాలని కోరారు. యజమాని వారికి నగలు చూపిస్తున్న సమయంలో అతడి దృష్టిని మరలించిన మహిళలు.. షాపులో ఉన్న సుమారు ఏడు తులాల బంగారు ముక్కుపుడకలు కలిగిన బాక్సును అపహరించినట్లు తెలిపారు.
కొంతసేపటి తర్వాత బంగారు ఆభరణాల బాక్సు కనిపించకపోవడంతో షాపు యజమాని చెన్నూరి శివకుమార్ విషయాన్ని గుర్తించారు. వెంటనే జహీరాబాద్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
చోరీకి పాల్పడిన మహిళలు షాపులోకి రావడం, నగలు పరిశీలించడం, అనంతరం బంగారు ఆభరణాల బాక్సును తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నమోదై ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలిస్తూ నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు.
నలుగురు మహిళలు ముందస్తు పథకంతోనే షాపులోకి వచ్చి చోరీకి పాల్పడ్డారా? వీరికి మరెవరైనా సహకరించారా? అనే కోణాల్లోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే గుర్తించి పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
తెలుగు ట్రెండ్స్ – జహీరాబాద్ రిపోర్టర్ నర్సింహా


కామెంట్ను పోస్ట్ చేయండి