రైతులకు తెలియకుండానే భూమి రిజిస్ట్రేషన్?
6.29 ఎకరాల భూమిని వేరే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ రైతుల ఆరోపణ.. తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన
మనోహరాబాద్, ఆగస్టు 18 (తెలుగు ట్రెండ్స్):
తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే 6.29 ఎకరాల భూమిని వేరే వ్యక్తి పేరుపై రిజిస్ట్రేషన్ చేశారంటూ మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ గ్రామానికి చెందిన రైతులు వర్గంటి అనంతరెడ్డి, వర్గంటి మల్లారెడ్డి ఆందోళనకు దిగారు. మంగళవారం మనోహరాబాద్ తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు, వారి కుటుంబ సభ్యులు ధర్నా నిర్వహించారు.
తమ భూమిని తమకు తెలియకుండా ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారని ప్రశ్నిస్తూ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో వర్గంటి మల్లారెడ్డి తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను తీసుకుని తాగేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతడిని అడ్డుకుని డబ్బాను స్వాధీనం చేసుకున్నారు.
అయితే తీవ్ర మనస్తాపానికి గురైన మల్లారెడ్డి అక్కడికక్కడే స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
సమాచారం అందుకున్న మనోహరాబాద్ ఎస్సై సుభాష్ గౌడ్ ఘటనాస్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు.
భూమి రిజిస్ట్రేషన్ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని బాధిత రైతులు డిమాండ్ చేశారు.
రిపోర్ట్: ఆర్. చంద్రశేఖర్, మనోహరాబాద్







కామెంట్ను పోస్ట్ చేయండి