రామాయంపేటలో ఆగస్టు 6న ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ.. విజయవంతం చేయాలని పిలుపు

రామాయంపేట, ఆగస్టు 4: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతిని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ (గురువారం) రామాయంపేట పట్టణంలోని రాజేంద్రనగర్ వై జంక్షన్‌లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు బీసీ, స్వర్ణకార సంఘాల నాయకులు తెలిపారు.

పట్టణ స్వర్ణకార సంఘం, బీసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకోజు దామోదరాచారి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ రావు, మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు, మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌తో పాటు పాలకవర్గ సభ్యులు హాజరుకానున్నారు.

తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంత దిక్సూచిగా నిలిచిన ప్రొఫెసర్ జయశంకర్ సార్‌కు ఘన నివాళులర్పించే ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు, యువత, ప్రజలు పార్టీలకతీతంగా పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

ఈ మేరకు నిర్వహించిన సన్నాహక సమావేశంలో బీసీ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మెట్టు గంగారం, పట్టణ అధ్యక్షులు కృష్ణాపురం రామకృష్ణ చారి, నాయకులు రవీందర్ చారి, ముకుందం చారి, రాగి రాములు, కౌన్సిలర్ జయశంకర్ గౌడ్, మామిడి సీతారాములు, కంభంపాటి విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads