తూప్రాన్లో భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత.. 49 క్వింటాళ్లు స్వాధీనం
తూప్రాన్, ఆగస్టు 19 (తెలుగు ట్రెండ్స్): అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని తూప్రాన్ పోలీసులు పట్టుకున్నారు. తూప్రాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నర్సాపూర్ రోడ్డులో వెంకటాపూర్ శివారు వద్ద అనుమానాస్పదంగా కనిపించిన ఓ వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
వాహనంలో పీడీఎస్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే వాహనాన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం ఈ విషయాన్ని సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. సంబంధిత అధికారులు పోలీసుల సమక్షంలో వాహనాన్ని పరిశీలించి పంచనామా నిర్వహించారు.
సివిల్ సప్లై అధికారులు నిర్వహించిన పంచనామా ప్రకారం వాహనంలో సుమారు 49 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో సంబంధిత వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించి శివంపేట మండలం రత్నాపూర్ తండాకు చెందిన వాహన డ్రైవర్, యజమాని అరుణ్, అలాగే చిన్న, మధు అనే మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పీడీఎస్ బియ్యం ఎక్కడి నుంచి సేకరించారు? ఎక్కడికి తరలిస్తున్నారు? ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వం పేదలకు అందించేందుకు కేటాయించిన ప్రజా పంపిణీ వ్యవస్థ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. పట్టుబడిన బియ్యం, వాహనాన్ని తదుపరి విచారణలో భాగంగా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తూప్రాన్ – ఆర్. చంద్రశేఖర్
తెలుగు ట్రెండ్స్


కామెంట్ను పోస్ట్ చేయండి