44వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
బంగారమ్మ దేవాలయం సమీపంలో వెనుక నుంచి ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
వెల్దుర్తి మండలం, ఆగస్టు 15: మాసాయిపేట మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై బంగారమ్మ దేవాలయం సమీపంలో శనివారం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొనడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది.
నడిగడ్డ తండా గ్రామపంచాయతీ పరిధిలోని ఓ తండాకు చెందిన మలోత్ మణి (40) కూరగాయలు తీసుకుని వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం ఆమెను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తూప్రాన్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి కారణమైన గుర్తుతెలియని వాహనం కోసం దర్యాప్తు చేపట్టారు. వాహనాన్ని గుర్తించేందుకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
తెలుగు ట్రెండ్స్
రిపోర్టర్: నర్సింహాగౌడ్ , వెల్దుర్తి


కామెంట్ను పోస్ట్ చేయండి