గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలి: పాలడుగు సుధాకర్

మెదక్, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):
తెలంగాణ గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలను విజయవంతం చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు సుధాకర్ పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 8, 9 తేదీల్లో మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలో జరగనున్న రాష్ట్ర కార్యవర్గ సమావేశాల ఏర్పాట్లపై ఆహ్వాన సంఘం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పాలడుగు సుధాకర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు, వారి హక్కుల సాధన, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణపై రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికులు గ్రామాల్లో పారిశుద్ధ్యం, చెత్త సేకరణ, మురుగు కాలువల శుభ్రత, మంచినీటి సరఫరా, విద్యుత్ సేవల నిర్వహణ వంటి కీలక సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రభుత్వం వారికి తగిన గుర్తింపు ఇవ్వడం లేదని విమర్శించారు.

ఎన్నికల సమయంలో గ్రామపంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి కార్మికుడికి రూ.15 లక్షల ప్రమాద బీమా కల్పించాలని, విధి నిర్వహణలో అనారోగ్యానికి గురైన కార్మికులకు ఈఎస్ఐ ద్వారా వైద్య సదుపాయాలు అందించాలని కోరారు.

రాష్ట్ర కార్యవర్గ సమావేశాల నిర్వహణ కోసం జిల్లా ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆహ్వాన సంఘం చైర్మన్‌గా శ్రీ యాదయ్య, కార్యదర్శిగా ఎం. మల్లేశం, కోశాధికారిగా ఆసీఫ్‌ను ఎన్నుకోగా, పాలడుగు సుధాకర్, ఎం. అడివయ్య, కె. నర్సమ్మ, బి. బలమణి తదితరులను ముఖ్య బాధ్యతల్లో నియమించారు. జిల్లా గ్రామపంచాయతీ కార్యదర్శుల యూనియన్లు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు కూడా ఆహ్వాన సంఘంలో భాగస్వాములయ్యారు.

ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఏ. మహేందర్ రెడ్డి, కె. నాగరాజు, అలాగే జిల్లాలోని వివిధ మండలాల గ్రామపంచాయతీ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads