30 ఏళ్లు కాంగ్రెస్‌లో పదవులు చేసి.. ఇప్పుడు పార్టీ నేతలపైనే విమర్శలా?

 



“30 ఏళ్లు కాంగ్రెస్‌లో పదవులు చేసి.. ఇప్పుడు నాయకులపైనే విమర్శలా?”

అరిగే రమేష్‌పై కొల్చారం కాంగ్రెస్ నేతల ఫైర్.. ఆధారాలతో నిరూపించాలని సవాల్

కొల్చారం, ఆగస్టు 21 (తెలుగు ట్రెండ్స్): కాంగ్రెస్ పార్టీలో మూడు దశాబ్దాలుగా కొనసాగి సర్పంచ్, ఎంపీపీ, జడ్పీటీసీ వంటి పదవులు అనుభవించిన అరిగే రమేష్ కుమార్.. ఇప్పుడు అదే పార్టీ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని కొల్చారం మండల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. కాంగ్రెస్ జిల్లా నాయకుడు ఆంజనేయులు గౌడ్‌ను బ్రోకర్‌గా సంబోధించడం తీవ్రంగా ఖండించారు.

శుక్రవారం పోతంశెట్టిపల్లి హనుమమ్మ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నాగులగారి మల్లేశం గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీని కన్నతల్లిగా భావించి పనిచేసిన నాయకులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రమేష్‌కు తగదన్నారు. కాంగ్రెస్ పార్టీ వల్లే సర్పంచ్ నుంచి ఎంపీపీ, జడ్పీటీసీ వరకు పదవులు పొందిన విషయాన్ని మర్చిపోవద్దని సూచించారు.

“30 ఏళ్లలో రంగంపేటకు ఏం అభివృద్ధి చేశావో ప్రజలకు చెప్పు” అంటూ మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎల్లుగారి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. యువ నాయకులను తప్పుదోవ పట్టిస్తూ కాంగ్రెస్ పార్టీపై, జిల్లా నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు.

గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రంగంపేటకు వచ్చిన సభకు సంబంధించిన స్థలంపై కూడా రమేష్ వివరణ ఇవ్వాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ప్రజల ముందు క్షమాపణ చెప్పాలని సవాల్ చేశారు.

ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లో చేరి కాంగ్రెస్ నాయకులపై విమర్శలు చేయడం వెనుక కారణమేంటని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. రమేష్ ఆస్తులకు సంబంధించిన వివరాలను త్వరలో జిల్లా కలెక్టర్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఆధారాలు లేకుండా కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో అప్పాజీపల్లి సర్పంచ్ వెంకట్ గౌడ్, చిన్నఘనపూర్ సర్పంచ్ మధుసూదన్ రెడ్డి, రంగంపేట మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్, అంసాన్‌పల్లి మాజీ సర్పంచ్ మన్నే శ్రీనివాస్, చిన్నఘనపూర్ సొసైటీ చైర్మన్ మంద నాగయ్య, వరిగుంతం మాజీ ఎంపీటీసీ తుడుం రామకిష్టయ్య, రంగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు గొండ కృష్ణ, సంగయ్యపేట గ్రామ శాఖ అధ్యక్షుడు ఆగం గౌడ్, కొమ్ముల రవీందర్ గౌడ్, ఏర్పుల రమేష్, నర్సింలు, కొప్పుల యేసు రాజు, బండి మల్లేశం, శ్రీరాములు, సామెల్, రవీందర్, శ్రావణ్, చిలుక ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

– ముత్తయ్య, తెలుగు ట్రెండ్స్📄 పూర్తి పేపర్ చూడండి:

[మీ Google Drive PDF లింక్]📄 పూర్తి పేపర్ చూడండి: [మీ Google Drive PDF లింక్]

0/Post a Comment/Comments

ads

ads