భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం
పాపన్నపేట, ఆగస్టు 16 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణలో ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం మొదటి శ్రావణ ఆదివారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉదయం నుంచే వివిధ వాహనాల్లో ఏడుపాయలకు చేరుకున్నారు.
భక్తులు మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవారి దర్శనం కోసం ఆలయంలోని ప్రధాన క్యూలైన్లలో బారులు తీరారు. సెలవు దినం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. ఆలయ పరిసరాలు అమ్మవారి నామస్మరణతో మారుమోగాయి.
భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దర్శనం, క్యూలైన్లు, ఇతర సౌకర్యాలను పర్యవేక్షించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
సంతానం కోసం కోరుకునే కొందరు భక్తులు అమ్మవారి సంతాన గుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. తమ కోర్కెలు నెరవేరిన భక్తులు అమ్మవారికి ఓడిబియ్యం, బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
శ్రావణ మాసం సందర్భంగా ఆలయానికి భక్తుల రాక మరింత పెరిగే అవకాశం ఉండటంతో అధికారులు, ఆలయ సిబ్బంది భక్తులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, దీపక్ రెడ్డి, బ్రహ్మచారి, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, బలరాం తదితరులు పాల్గొన్నారు. రిపోర్ట్ P. శ్రీనివాస్


కామెంట్ను పోస్ట్ చేయండి