ఉపాధి చూపి గౌరవప్రదమైన జీవితంలోకి మహిళలు.. పోలీసుల వినూత్న పునరావాస కార్యక్రమం
వ్యభిచార వృత్తికి స్వస్తి.. ప్రత్యామ్నాయ ఉపాధితో కొత్త జీవితం
మహిళలకు శిక్షణ, ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వ శాఖలతో సమన్వయం
డీఎస్పీ నరేందర్ గౌడ్
తూప్రాన్, ఆగస్టు 06 (Telugu Trends):
వ్యభిచార వృత్తిని వీడి మహిళలు గౌరవప్రదమైన జీవనం సాగించేలా చేయడమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు. మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి, వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడానికి అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని సరోజినీనగర్ వద్ద జాతీయ రహదారి పక్కన కొందరు మహిళలు వ్యభిచార వృత్తిలో కొనసాగుతున్నట్లు గుర్తించిన పోలీసులు, మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ ఆదేశాల మేరకు వారం రోజుల క్రితం కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సరైన ధ్రువపత్రాలు లేని 16 మంది మహిళలను గుర్తించి షెల్టర్ హోమ్కు తరలించారు. అనంతరం వారిని వ్యభిచార వృత్తి నుంచి పూర్తిగా బయటకు తీసుకువచ్చి గౌరవప్రదమైన జీవనం సాగించేలా పునరావాస చర్యలు ప్రారంభించారు.
వారి నైపుణ్యాలను గుర్తించి వాటికి అనుగుణంగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు డీఆర్డీఏ, ఆర్డీవోతో పాటు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. మహిళలకు అవసరమైన నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అధికారులు విస్తృతంగా చర్చించారు.
మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా శిక్షణతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సమావేశంలో నిర్ణయించారు. తిరిగి వ్యభిచార వృత్తిలోకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు కల్పించి సమాజంలో గౌరవంగా జీవించేలా చేయడమే పోలీస్ శాఖ సంకల్పమని డీఎస్పీ నరేందర్ గౌడ్ స్పష్టం చేశారు.
మహిళలు, బాలికల భద్రతతో పాటు సామాజికంగా వెనుకబడిన వారికి రక్షణ, పునరావాసం కల్పించడంలో పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ముందుంటుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సరోజినీనగర్ వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను డీఎస్పీ నరేందర్ గౌడ్ ప్రారంభించారు. జాతీయ రహదారి పరిసరాల్లో నిఘాను మరింత పటిష్టం చేయడంతో పాటు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు దోహదపడతాయని అధికారులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ, ఆర్డీవో, రామాయంపేట సీఐ సైదా, నార్సింగి ఎస్ఐ సృజనతో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.


కామెంట్ను పోస్ట్ చేయండి