బీసీల సామాజిక న్యాయ పోరాటానికి బీపీ మండల్ చిరస్మరణీయం.. ఘనంగా 109వ జయంతి వేడుకలు

 


రిపోర్టర్: బి. యాదగిరి

సామాజిక న్యాయం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి బీపీ మండల్

ఘనంగా 109వ జయంతి వేడుకలు.. విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ

నవ పలుకులు – రామాయంపేట, ఆగస్టు 25:

దేశంలో సామాజిక న్యాయం కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహోన్నత వ్యక్తి బిందేశ్వరి ప్రసాద్ మండల్ (బీపీ మండల్) అని రామాయంపేట మున్సిపల్ కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు గజవాడ నాగరాజు అన్నారు. మంగళవారం రామాయంపేట పట్టణంలో యాదవ సంఘం ఆధ్వర్యంలో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బీసీ మండల్ కమిషన్ చైర్మన్ బీపీ మండల్ 109వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేశారు.

ఈ సందర్భంగా గజవాడ నాగరాజుతో పాటు బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మెట్టు గంగారం, బీఆర్‌ఎస్ నాయకుడు మద్దెల రమేష్, యాదవ సంఘం ప్రతినిధి బసన్నపల్లి రాజు యాదవ్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఊడెం దేవరాజు, రామాయంపేట ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు బసన్నపల్లి మల్లేశం మాట్లాడుతూ.. బడుగు, బలహీన, వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, రాజకీయ రంగాల్లో సమాన అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో బీపీ మండల్ చేసిన కృషి చారిత్రాత్మకమని కొనియాడారు.

బీసీ మండల్ కమిషన్ చైర్మన్‌గా ఆయన అందించిన సేవలు దేశ సామాజిక, రాజకీయ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల స్థితిగతులను అధ్యయనం చేసి వారికి న్యాయం జరిగేలా సిఫారసులు చేయడంలో బీపీ మండల్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

వెనుకబడిన తరగతులకు 27 శాతం రిజర్వేషన్ల అమలుకు ఆయన చేసిన కృషి దేశవ్యాప్తంగా బీసీలకు సామాజిక, విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాల కల్పనకు మార్గం సుగమం చేసిందన్నారు. బీసీల అభ్యున్నతి కోసం బీపీ మండల్ చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు.

బీపీ మండల్ ఆశయాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నాయకులు అన్నారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం అన్ని వర్గాలు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత బీపీ మండల్ ఆలోచనా విధానాన్ని తెలుసుకుని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు.

అనంతరం యాదవ సంఘం ఆధ్వర్యంలో బీపీ మండల్ విగ్రహ ఏర్పాటు కోసం భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బీపీ మండల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఆయన సేవలను భవిష్యత్ తరాలకు గుర్తుచేసే అవకాశం ఉంటుందని నాయకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డీజీ శ్రీనివాసశర్మ, మున్సిపల్ కౌన్సిలర్లు పుట్టి సందీప్, దేవుని రంజిత్, గుగులోత్ రవి, కోఆప్షన్ సభ్యుడు గౌస్, కాంగ్రెస్ నాయకులు దాకి స్వామి, చింతల స్వామి, ఎనిశెట్టి అశోక్ గుప్తా, బైరం కుమార్, యాదవ సంఘం నాయకులు అన్నమైన పోచయ్య యాదవ్, ఎర్రగొల్ల రమేష్ యాదవ్, దోరగొల్ల దుర్గయ్య యాదవ్, అన్నమైన మల్లయ్య యాదవ్, రాములు యాదవ్, శ్రీశైలం యాదవ్, బత్తుల రవి యాదవ్, దోనేటి గోపాల్ యాదవ్‌తో పాటు బీసీ, యాదవ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads