పోలీస్–మెడికల్–108 సమన్వయంతో అత్యవసర వైద్య సేవలు మరింత సమర్థవంతం

రామాయంపేట, ఆగస్టు 4 (తెలుగు ట్రెండ్స్):

గుర్తుతెలియని వ్యక్తులు అపస్మారక స్థితిలో ఆసుపత్రికి చేరిన సందర్భాల్లో వారికి సకాలంలో మెరుగైన వైద్యం అందించి, అవసరమైతే రెఫరల్ ఆసుపత్రులకు తరలించే ప్రక్రియను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్, వైద్యశాఖ, 108 అంబులెన్స్ సిబ్బంది సమన్వయ సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ లింబాద్రి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో, అపస్మారక స్థితిలో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులకు ప్రాథమిక చికిత్స అనంతరం రెఫరల్ ఆసుపత్రులకు పంపే సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులను రామాయంపేట ఎస్సై బాలరాజుకు వివరించి, వాటి పరిష్కారానికి అవసరమైన సూచనలు స్వీకరించారు.

ఈ సందర్భంగా ఎస్సై బాలరాజు మాట్లాడుతూ, ఇలాంటి అత్యవసర కేసుల్లో పోలీసు శాఖ తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. 108 ఉమ్మడి మెదక్ జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ సంపత్ మాట్లాడుతూ, అవసరమైన సందర్భాల్లో 108 అంబులెన్స్ సేవలను అందుబాటులో ఉంచి బాధితులకు సకాలంలో సహాయం అందిస్తామని తెలిపారు.

ఈ సమావేశంలో వైద్యులు డాక్టర్ అజయ్, డాక్టర్ శ్రీముఖి, మెదక్ జిల్లా 108 కోఆర్డినేటర్ కిరణ్, హెడ్ నర్సులు, నర్సింగ్ సిబ్బంది, 108 సిబ్బంది శ్రీనివాస్ గౌడ్, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.

0/Post a Comment/Comments

ads

ads