రైతుల్లేని ఎఫ్ఎఫ్ఎస్ అవగాహన సదస్సు.. ఖాళీ కుర్చీలతో అధికారుల హడావుడి 11 గంటలైనా రైతుల జాడ లేదు.. నలుగురితోనే సదస్సు నిర్వహించారన్న ఆరోపణలు
చిత్తం శివుని మీద.. భక్తి చెప్పుల మీద అన్న చందంగా మారిన అధికారుల తీరు రైతుల్లేని అవగాహన సదస్సు.. ఖాళీ కుర్చీలతో ‘ఎఫ్ఎఫ్ఎస్’ ప్రచారం కొల్చారం, ఆగస్టు 27 (నవ పలుకులు): రైతులకు ఎరువుల బుకింగ్ విధానంపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం కొల్చారం రైతు వేదికలో నిర్వహించిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ అవగాహన సదస్సు రైతుల్లేకుండానే సాగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూరియా బుకింగ్ కోసం రైతులు ఎఫ్ఎఫ్ఎస్ యాప్ వినియోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, వారికి అవగాహన కల్పించాల్సిన సదస్సుకే రైతులు హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం ఇటీవల అమల్లోకి తీసుకువచ్చిన ఎఫ్ఎఫ్ఎస్ యాప్ ద్వారా రైతులు ఎరువులు బుక్ చేసుకోవాల్సి ఉంది. అయితే యాప్ వినియోగంపై పూర్తి అవగాహన లేకపోవడంతో పలువురు రైతులు బుకింగ్ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులకు యాప్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు గురువారం ఉదయం 10.30 గంటలకు కొల్చారం రైతు వేదికలో సదస్సు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే సదస్సు గురించి రైతులకు ముందస్తుగా సమాచారం అందించడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. నిర్ణీత సమయానికి రైతు వేదిక వద్దకు రైతులు పెద్ద సంఖ్యలో రావాల్సి ఉండగా, అక్కడ కుర్చీలు ఖాళీగా కనిపించాయని స్థానికులు చెబుతున్నారు. సుమారు 11 గంటల వరకు రైతుల కోసం ఎదురుచూసినా ఆశించిన స్థాయిలో రైతులు హాజరు కాలేదని తెలుస్తోంది. నలుగురితోనే అవగాహన సదస్సా? వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన కొంతమంది రైతులను రైతు వేదికలో కూర్చోబెట్టి వారికి ఎఫ్ఎఫ్ఎస్ యాప్ గురించి వివరించి సదస్సు నిర్వహించినట్లు చూపించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రైతులందరికీ ముందస్తుగా సమాచారం ఇచ్చి, వారి సమస్యలను తెలుసుకుని, యాప్ వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అధికారులు కార్యక్రమాన్ని తూతూమంత్రంగా ముగించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూరియా బుకింగ్ కోసం రైతులు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారికి ఉపయోగపడేలా నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమానికి రైతులే హాజరుకాకపోవడం వ్యవసాయ శాఖ అధికారుల సమాచార లోపాన్ని స్పష్టం చేస్తోందని పలువురు రైతులు అంటున్నారు. గ్రామాల వారీగా రైతులకు సమాచారం అందించి, రైతు వేదికకు వారిని రప్పించి ఉంటే ఎఫ్ఎఫ్ఎస్ యాప్పై మరింత మందికి అవగాహన కలిగేదని పేర్కొంటున్నారు. రైతులకు అవసరమైన సమయంలో ఎరువుల బుకింగ్ విధానం సులభంగా అర్థమయ్యేలా అధికారులు గ్రామస్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. యాప్ వినియోగంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి శ్వేతాకుమారి, తుక్కాపూర్ ఏఈఓ అమృత్ తదితరులు పాల్గొన్నారు. నవ పలుకులు – రిపోర్టర్: ముత్తయ్య, కొల్చారం




కామెంట్ను పోస్ట్ చేయండి