చిన్న శంకరంపేట ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ప్రతిమా సింగ్
తెలుగు ట్రెండ్స్ | మెదక్ డెస్క్
చిన్న శంకరంపేట: విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేలా వసతి గృహాల్లో ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ హాస్టల్ నిర్వాహకులను ఆదేశించారు.
గురువారం చిన్న శంకరంపేట మండల పర్యటనలో భాగంగా షెడ్యూల్డ్ కులాల (SC) బాలుర వసతి గృహాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వంటగది, స్టోర్రూమ్ను పరిశీలించి ఆహార పదార్థాల నిల్వ, పరిశుభ్రతను తనిఖీ చేశారు. అనంతరం హాస్టల్ ఆవరణ, డ్రైనేజీ వ్యవస్థ, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. హాస్టల్లోని విద్యార్థుల సంఖ్య, సిబ్బంది వివరాలను వార్డెన్ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హాస్టల్లో ప్రతిరోజూ శుభ్రత చర్యలు చేపట్టాలని, మరుగుదొడ్లు, గదుల పరిశుభ్రతకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. హాస్టల్ ఆవరణలో మొక్కలను క్రమపద్ధతిలో పెంచాలని, ప్రభుత్వం మంజూరు చేసిన ఇంటిగ్రేటెడ్ నిధులను వినియోగించి అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలని ఆదేశించారు. విద్యార్థులకు తగినంత వెలుతురు ఉండేలా అదనంగా ట్యూబ్లైట్లు ఏర్పాటు చేయాలని, బయటి వ్యక్తులను హాస్టల్లోకి అనుమతించరాదని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో హాస్టల్ వార్డెన్ తులసీరామ్, ఎంపీడీవో దామోదర్, సర్పంచ్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్ను పోస్ట్ చేయండి