భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వనదుర్గామాత ఆలయం
పాపన్నపేట, ఆగస్టు 23 (తెలుగు ట్రెండ్స్): తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందిన ఏడుపాయల శ్రీ వనదుర్గామాత ఆలయం ఆదివారం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. తెల్లవారుజాము నుంచే జిల్లాతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఏడుపాయలకు తరలివచ్చారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయ ప్రాంగణంలోని క్యూ లైన్లలో బారులు తీరారు.
ఆదివారం సెలవు రోజు కావడంతో ఆలయానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తమ మొక్కులు చెల్లించుకున్నారు. కోర్కెలు నెరవేరిన భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సంతానం కోసం ఎదురుచూస్తున్న పలువురు దంపతులు సంతాన గుండంలో స్నానాలు ఆచరించి అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పూజించారు.
భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రద్దీని నియంత్రిస్తూ భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. ఆలయ పూజారులు పార్థివ శర్మ, శంకర్ శర్మ భక్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అమ్మవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ఆలయ సిబ్బంది సూర్య శ్రీనివాస్, మధుసూదన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, సాయిబాబా, నరేష్, మహేష్, యాదగిరి, దీపక్ రెడ్డి, బలరాం తదితరులు భక్తులకు సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పాపన్నపేట ఎస్సై శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో నిరంతరం పర్యవేక్షిస్తూ భక్తులకు భద్రత కల్పించారు.
తెలుగు ట్రెండ్స్
– పాపన్నపేట



إرسال تعليق