రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దహనం.. మెదక్లో బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా
మెదక్, జూలై 24: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం మెదక్ పట్టణంలోని రాందాస్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చిత్రపటాన్ని దహనం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ, నీట్ పరీక్ష పేపర్ లీక్ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ నాయకులు ఆందోళనలు చేపడుతున్నారని విమర్శించారు.
నీట్ పేపర్ లీక్కు బాధ్యులపై ఇప్పటికే చర్యలు తీసుకుని, అరెస్టులు చేసి జైలుకు పంపారని, అనంతరం మళ్లీ పరీక్ష నిర్వహించగా విద్యార్థులు పరీక్ష రాసి సంతోషం వ్యక్తం చేశారని తెలిపారు. దేశ వ్యతిరేక శక్తులతో కలిసి వ్యవహరించడం సరికాదని, బాధ్యతాయుతమైన ప్రతిపక్ష నాయకుడిగా వ్యవహరించాలని రాహుల్ గాంధీకి సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాగి రాములు, జిల్లా ఉపాధ్యక్షులు కౌన్సిల్ శంకర్ గౌడ్, ఒబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు గడ్డం కాశీనాథ్, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, కౌన్సిలర్ పబ్బ రాజమణి, లక్ష్మణ్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షులు జైన్ సింగ్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మల్లిక, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బాలరాజు, జిల్లా కార్యదర్శి కల్కి నాగరాజు, జిల్లా నాయకులు విజయ్ మల్లారెడ్డి, మండల అధ్యక్షులు, సర్పంచులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


إرسال تعليق